Copyrights Reserved © 2026
prajayuddanouka.com
(సూర్యాపేట , తెలంగాణ)»»» సూర్యాపేటలో నిబంధనలు గంగలో... కోట్ల రూపాయలు జేబుల్లో!»»» మూతపడిన మిల్లులకూ కేటాయింపులు... కలెక్టర్కే తప్పుడు రిపోర్టులు»»» విజిలెన్స్ విచారణతో అక్రమార్కుల గుండెల్లో పరిగెడుతున్న రైళ్లు!ప్రజాయుద్ధనౌక ప్రతినిధి (సూర్యాపేట): దొంగలు దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్టు సూర్యాపేట జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ (CMR) కేటాయింపుల్లో అక్రమాల మిల్లర్లు, అవినీతి సివిల్ సప్లై అధికారులు కుమ్మక్కై కోట్ల రూపాయల ప్రజాధనాన్ని నమిలేసిన ఉదంతం ఇప్పుడు తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. అధికారులు నిబంధనలను తుంగలో తొక్కి సహకరించగా, అవినీతి మిల్లర్లు అందిన బియ్యాన్ని దర్జాగా బొక్కేశారు. పౌరసరఫరాల శాఖ అధికారుల కనుసన్నల్లో, మిల్లర్ల కనుసైగల్లో కోట్ల రూపాయల విలువైన సీఎంఆర్ బియ్యం మాయమైపోవడం జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.రూల్స్ పక్కనపెట్టి... మూతపడిన మిల్లులకూ కేటాయింపులు! ప్రభుత్వ నిబంధనల ప్రకారం... పాత సీఎంఆర్ బాకీ బియ్యాన్ని పూర్తిగా ఇచ్చిన మిల్లులకే కొత్త ధాన్యాన్ని కేటాయించాలి. కానీ సూర్యాపేట జిల్లా అధికారులు ఈ చట్టాలను బొందపెట్టారు. గతంలో బియ్యం ఇవ్వక డిఫాల్ట్ అయిన మిల్లులకు, అసలు నడవకుండా మూతపడిన మిల్లులకు, ఆఖరికి మిల్లింగ్ ప్రారంభమే కాని మిల్లులకు కూడా టన్నుల కొద్దీ ధాన్యాన్ని కట్టబెట్టారు. మిల్లర్ల నుంచి ముడుపుల నజరానా అందడమే ఆలస్యం... నిబంధనలను కాదని అడిగినంత కేటాయించేశారు. గడిచిన కొన్ని ఏళ్లుగా ఈ బియ్యాన్ని మిల్లర్లు బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నా, అధికారులకు "ఇవ్వాల్సింది" అందడంతో ఏమీ పట్టనట్లు వ్యవహరించారు.సాక్షాత్తు కలెక్టర్కే బురిడీ! ప్రతినెలా క్షేత్రస్థాయిలో తనిఖీలు చేసి నివేదికలు ఇవ్వాల్సిన అధికారులు... ఏకంగా జిల్లా కలెక్టర్కే తప్పుడు సమాచారంతో నివేదికలు అందించినట్లు తెలుస్తోంది. మూతపడిన మిల్లులు సక్రమంగా నడుస్తున్నాయని, మిల్లుల్లో ధాన్యం నిల్వలు లేకపోయినా పుష్కలంగా ఉన్నాయని మూడు నెలల క్రితం కలెక్టర్కే అబద్ధపు రిపోర్టులు ఇచ్చారంటే వీరి బరితెగింపు ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు.రంగంలోకి విజిలెన్స్... బెంబేలెత్తుతున్న తోడుదొంగలు! ఈ భారీ అక్రమాలపై ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం ఆరుగురు సభ్యులతో కూడిన 'స్పెషల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్' టీమ్ను విచారణకు ఆదేశించింది. గడిచిన రెండు వారాలుగా సూర్యాపేట జిల్లాలో డ్రైవ్ చేపట్టిన స్పెషల్ టీమ్... గత నాలుగు సంవత్సరాల కేటాయింపుల రికార్డులను, మిల్లుల్లోని వాస్తవ నిల్వలను జల్లెడ పట్టింది. ఈ విచారణలో మిల్లర్ల దోపిడీతో పాటు అధికారుల పాత్రకు సంబంధించిన పక్కా ఆధారాలు లభించినట్లు సమాచారం. ఇంకో రెండు రోజుల్లో విజిలెన్స్ టీమ్ నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది. నివేదిక బయటపడితే తమ ఉద్యోగం ఊడటం ఖాయమని అధికారుల్లో గుబులు మొదలై అవినీతి అధికారులు, మిల్లర్లు ఇప్పుడు గజ గజ వణుకుతున్నారు. ప్రభుత్వ ధనాన్ని ముక్కలు చేసి తిన్న ఈ తోడుదొంగలైన అవినీతి మిల్లర్లు, అవినీతి అధికారులు మరియు వారికి సహకరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు ముక్త కంఠంతో కోరుతున్నారు.
ప్రజాయుద్ధనౌక ప్రతినిధి (హైదరాబాద్): హైదరాబాద్ లో సోమవారం రాత్రి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలందరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని నగరం పోలీస్ కమిషనర్ సీపీ వీసీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. వాతావరణ పరిస్థితుల తీవ్రత దృష్ట్యా అత్యవసరమైతే తప్ప అనవసర ప్రయాణాలు చేయవద్దని, ప్రజలు తమ ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని సూచించారు. ప్రసుతం బయట ఉన్నవారు వర్షం తీవ్రరూపం దాల్చకముందే తమ పనులను త్వరితగతిన ముగించుకుని సురక్షితంగా ఇళ్లకు చేరుకోవాలని కోరారు. ముఖ్యంగా జలమయమైన రహదారులు, ముంపునకు గురయ్యే లోతట్టు ప్రాంతాల గుండా ప్రయాణించడం అత్యంత ప్రమాదకరమని, వాహనదారులు వేగం తగ్గించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే సత్వర సహాయం కోసం డయల్ 100 లేదా స్థానిక పోలీసు, మున్సిపల్ యంత్రాంగాన్ని సంప్రదించాలని సీపీ వెల్లడించారు.
ప్రజాయుద్ధనౌక ప్రతినిధి (హైదరాబాద్): సికింద్రాబాద్లోని చారిత్రాత్మక ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల పండుగను పురస్కరించుకుని భువనగిరి పార్లమెంట్ సభ్యులు (ఎంపీ) చామల కిరణ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు. ఈ వేడుకల సందర్భంగా రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి మరియు హైదరాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ మినిస్టర్ క్వార్టర్స్లో ఏర్పాటు చేసిన విందు కార్యక్రమానికి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు పాల్గొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
»» మృతుని చిత్రపటానికి నివాళులర్పించిన వైస్ చైర్మన్ వెంకన్న గుప్తా »» బాధిత కుటుంబానికి అన్ని వేళలా అండగా ఉంటామని భరోసాయాదాద్రి భువనగిరి (మోత్కూరు జూలై 30): అకాల మరణం చెందిన నిరుపేద కుటుంబానికి మున్సిపల్ వైస్ చైర్మన్ పల్లెర్ల వెంకన్న గుప్తా అండగా నిలిచారు. మోత్కూరు మున్సిపల్ కేంద్రంలోని అంగడి బజారుకు చెందిన ఆరె జహంగీర్ ఇటీవల హఠాన్మరణం చెందగా, గురువారం ఆయన నివాసానికి వెళ్లిన వైస్ చైర్మన్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. జహంగీర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేద కుటుంబానికి చెందిన జహంగీర్ చిన్న వయస్సులోనే మృతి చెందడం తీవ్రంగా కలిచివేసిందన్నారు. వారి కుటుంబ అత్యవసర అవసరాల నిమిత్తం తనవంతుగా రూ. 10,000 ఆర్థిక సాయాన్ని అందజేసి అధైర్యపడవద్దని, కుటుంబానికి ఎల్లప్పుడూ పూర్తి స్థాయిలో అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బొల్లేపల్లి శ్రావణ్, ఇక్కిరి నాగరాజు, బోయిని యాకు, ప్రవీణ్, సోమిరెడ్డి, గోపి తదితరులు పాల్గొన్నారు.
»» పట్టుదలతో చదివి తల్లిదండ్రుల ఆశయాలు నెరవేర్చాలి»» బిసి హాస్టల్ విద్యార్థినులకు నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమంలో కౌన్సిలర్ లు శ్రీవిద్య, శైలజయాదాద్రి భువనగిరి, (మోత్కూరు జూలై 30): ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను ఆసరాగా చేసుకుని విద్యార్థులు చదువులో రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలని మోత్కూరు మున్సిపల్ కౌన్సిలర్లు గనగాని శైలజ, పన్నాల శ్రీవిద్య తెలిపారు. గురువారం స్థానిక బిసి బాలికల వసతి గృహంలో విద్యార్థినులకు బెడ్ షీట్లు, కార్పెట్లు, ప్లేట్లు మరియు గ్లాసులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో హాస్టల్ విద్యార్థుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, అందులో భాగంగానే మెస్ ఛార్జీలను భారీగా పెంచారని తెలిపారు. విద్యా రంగాన్ని బలోపేతం చేసేందుకు నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ విద్యా సంస్థను నెలకొల్పుతున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలను వినియోగించుకుని, క్రమశిక్షణతో చదివి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గర్వపడేలా భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని విద్యార్థినులకు సూచించారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ సిబ్బంది కామటి అరుణతో పాటు విద్యార్థినులు చైత్ర, కొనతం భవాని, సరబోజు రితిక, కమ్మగాని మధుప్రియ, దీక్షిత, కాటన్ మను, గుడిపాటి సిరి, సంపద తదితరులు పాల్గొన్నారు.
ప్రజాయుద్ధనౌక ప్రత్యేక ప్రతినిధి: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘హైడ్రా’ (HYDRAA) బాధ్యతల నుంచి ఐఏఎస్ అధికారి ఏవీ రంగనాథ్ను అంత సులభంగా పక్కన పెట్టే ప్రసక్తి లేదని స్పష్టమవుతోంది. చెరువుల ఆక్రమణలు, బడా రియల్ ఎస్టేట్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతూ సీఎం ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తున్న రంగనాథ్కు ప్రభుత్వం నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోంది. హైకోర్టు సింగిల్ బెంచ్ ఆయనను తొలగించాలని ఆదేశించిన నేపథ్యంలో, ప్రభుత్వం వెంటనే డివిజన్ బెంచ్లో రిట్ అప్పీల్ దాఖలు చేసేందుకు సన్నాహాలు చేస్తోందిరంగనాథ్పై కోర్టు ఆదేశాలతో ప్రభుత్వ వ్యూహం సింగిల్ బెంచ్ ఉత్తర్వులు: లోతుకుంట భూముల వివాదంలో కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారనే ఆరోపణలపై రంగనాథ్ను హైడ్రా కమిషనర్ పదవి నుంచి తొలగించాలని హైకోర్టు సింగిల్ బెంచ్ సీఎస్ను ఆదేశించింది. డివిజన్ బెంచ్కు అప్పీల్: సింగిల్ బెంచ్ ఆదేశాలపై స్టే కోరుతూ ప్రభుత్వం వెంటనే హైకోర్టు డివిజన్ బెంచ్ను ఆశ్రయించనుంది. హైడ్రా ఒక స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థ అని, దాని అధిపతి నియామకం కార్యనిర్వాహక పరిధిలోని అంశమని వాదించనుంది. సుప్రీంకోర్టు దాకా వెళ్లేందుకు సిద్ధం: ఒకవేళ డివిజన్ బెంచ్లో ఉపశమనం లభించకపోతే, రాజ్యాంగంలోని ఆర్టికల్ 136 కింద స్పెషల్ లీవ్ పిటిషన్ (SLP) ద్వారా సుప్రీంకోర్టు తలుపు తట్టేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ ప్రణాళికను సిద్ధం చేసుకుంది. ప్రజా ప్రయోజనాల కోసమే హైడ్రా పనిచేస్తోందని, ఒక నిర్దిష్ట వివాదంలో బేషరతు క్షమాపణ చెప్పినంత మాత్రాన అధికారిని మార్చాలని ఆదేశించడం ఎంతవరకు సమంజసమనే అంశాన్ని అత్యున్నత న్యాయస్థానం ముందు ప్రభుత్వం లేవనెత్తనుంది. తన నమ్మకమైన ఉన్నతాధికారిని నిలబెట్టుకోవడానికి, హైడ్రా దూకుడు తగ్గకుండా చూసుకోవడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చట్టపరమైన అన్ని దారులనూ ఉపయోగించుకునేందుకు తుది వరకు పోరాడేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమచారం.
»»» తమ సంస్థ పూర్తిగా రాజ్యాంగ స్ఫూర్తితోనే పనిచేసింది »»» ల్యాండ్ మాఫియా కోర్టును తప్పుదోవ పట్టిస్తోంది»»» తనపై ఉన్న కోర్టు ధిక్కార నోటీసులన్నీ భూ కబ్జాదారులు వేసినవే»»» తనకు దేశ న్యాయవ్యవస్థపై పూర్తి నమ్మకం ఉంది - ఏవీ రంగనాథ్ప్రజాయుద్ధనౌక ప్రతినిధి (హైదరాబాద్): హైడ్రా కమిషనర్గా ఏవీ రంగనాథ్ను తప్పించాలంటూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి రాష్ట్ర హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పందించారు. హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తమ సంస్థ పూర్తిగా రాజ్యాంగ స్ఫూర్తితోనే పనిచేసిందని, చెరువులను మరియు ప్రభుత్వ ఆస్తులను కాపాడటమే హైడ్రా ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఇప్పటివరకు దాదాపు రూ. 1.50 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించామని ఆయన గుర్తుచేశారు. అలాగే దాదాపు 6 చెరువులను పూర్తిగా పునరుద్ధరించామని, మరో 20 చెరువుల పునరుద్ధరణ పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయని తెలిపారు. వేల ఎకరాల కబ్జా భూములను వెనక్కి తీసుకుని తిరిగి ప్రభుత్వానికి అప్పగించామని, అదేవిధంగా లోతుకుంట ప్రాంతంలో భూకబ్జా యత్నాన్ని కూడా విజయవంతంగా అడ్డుకున్నామని పేర్కొన్నారు. అయితే ల్యాండ్ మాఫియా కోర్టును తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించిన రంగనాథ్, తనపై ఉన్న కోర్టు ధిక్కార నోటీసులన్నీ భూ కబ్జాదారులు వేసినవేనని తెలిపారు. ఏది ఏమైనప్పటికీ అన్ని కేసులను చట్టపరంగానే ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, తనకు దేశ న్యాయవ్యవస్థపై పూర్తి నమ్మకం ఉందని స్పష్టం చేశారు.