అక్షరం నేర్పిన గురువుకు అశ్రునివాళి: గళమెత్తి పాడి కంటతడి పెట్టిన డాక్టర్ మల్లెపాక అనిల్ కుమార్ మాదిగ
అజ్ఞానపు చీకట్లను పారద్రోలి వేలాది మంది విద్యార్థులను తీర్చిదిద్దిన ఆదర్శ గురువు, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు ఊట్కూరు స్వామి ఆయన స్వగ్రామమైన సూర్యాపేట జిల్లా నాగారం మండల పరిధిలోని పసునూరు గ్రామంలో బుధవారం కన్నుమూశారు. ఆయన మరణవార్త తెలుసుకున్న శిష్యులు, గ్రామస్తులు, ప్రజా సంఘాల నాయకులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
హుటాహుటిన చేరుకున్న శిష్యుడు డాక్టర్ మల్లెపాక అనిల్ కుమార్ మాదిగ
గ్రామానికి చెందిన ఊట్కూరు స్వామి వద్దే ప్రాథమిక విద్యాబుద్ధులు నేర్చుకొని, ప్రస్తుతం సమాజంలో తనదైన గుర్తింపు తెచ్చుకున్న ఎమ్మార్పీఎస్ కళా మండలి రాష్ట్ర అధ్యక్షుడు మల్లెపాక అనిల్ కుమార్ మాదిగ ఈ వార్త వినగానే తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. విషయం తెలియగానే హుటాహుటిన పసునూరు గ్రామానికి చేరుకుని తన ప్రియతమ గురువు పార్థివదేహాన్ని దర్శించుకున్నారు.
కన్నీటి వీడ్కోలు – గళంతో భావోద్వేగ నివాళి
గురువు భౌతికకాయం వద్ద డాక్టర్ మల్లెపాక అనిల్ కుమార్ బోరున విలపించారు. ఆయన పార్థివదేహంపై పూలమాలలు వేసి పాదాభివందనం చేశారు. అనంతరం తన గొంతుతో గురువు జ్ఞాపకాలను, ఆయన అందించిన జ్ఞానాన్ని స్మరిస్తూ హృదయాలను కదిలించేలా శ్రద్ధాంజలి గీతాన్ని ఆలపించారు. ఆయన పాడిన పాట అక్కడున్న గ్రామస్తులను, బంధువులను కంటతడి పెట్టించింది.
నా గురువు సేవలు చిరస్మరణీయం: డాక్టర్ మల్లెపాక అనిల్ కుమార్ మాదిగ
ఈ సందర్భంగా డాక్టర్ మల్లెపాక అనిల్ కుమార్ మాదిగ మాట్లాడుతూ నాకు అక్షరాలతో పాటు సమాజంలో ఎలా జీవించాలో నేర్పిన మహోన్నత వ్యక్తి ఊట్కూరు స్వామి సార్. ఎంతోమంది పేద విద్యార్థులను ఉన్నత స్థానాల్లో నిలిపిన నిస్వార్థ ఉపాధ్యాయులు. వారి క్రమశిక్షణ, బోధన నన్ను ఈ స్థాయికి చేర్చాయి. ఆయన మరణం పసునూరు గ్రామానికే కాకుండా యావత్ విద్యా రంగానికి తీరని లోటు అని ఆవేదన వ్యక్తం చేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత ఎస్సీ ఎడిటర్స్ & జర్నలిస్టుల ఫోరం జాతియ అధ్యక్షులు రొడ్డ నాగరాజు (RNR), ఎమ్మార్పీఎస్ నాయకులు బాలెంల బుచ్చిమల్లు, ఏపూరి గలం సభ్యులు ఏపూరి యాకన్న, చింతకుంట్ల పరమేష్, గ్రామ ప్రముఖులు, ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొని ఊట్కూరు స్వామి పార్థివదేహానికి నివాళులర్పించారు.