లక్నోలో బీఎస్పీ జాతీయ సమీక్షా సమావేశం: బహుజన ఉద్యమ బలోపేతానికి మాయావతి పిలుపు
ప్రజాయుద్ధనౌక (ప్రత్యేక ప్రతినిధి): బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) సంస్థాగత బలోపేతం, దేశంలో బహుజన ఉద్యమ విస్తరణ మరియు రాబోయే ఎన్నికల కార్యాచరణే లక్ష్యంగా ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో పార్టీ జాతీయ సమీక్షా సమావేశం గురువారం నిర్వహించారు. బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు బెహన్ కుమారి మాయావతి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో దేశంలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలు, సామాజిక పరిస్థితులపై సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా మాయావతి మాట్లాడుతూ క్షేత్రస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయాలని, బహుజన హక్కుల పరిరక్షణ కోసం గ్రామస్థాయి కమిటీలను చురుగ్గా నడిపిస్తూ ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటాలు సాగించాలని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్య నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల ఇన్ఛార్జులు, చీఫ్ సెంట్రల్ సెక్టార్ కోఆర్డినేటర్లు అతర్ సింగ్ రావు, సురేష్ ఆర్యల పర్యవేక్షణలో తెలంగాణ రాష్ట్ర నాయకులు జాతీయ నాయకత్వంతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇందులో స్టేట్ కోఆర్డినేటర్ బోయిని చంద్రశేఖర్ ముదిరాజ్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రామ్ శేఖర్, ఉపాధ్యక్షుడు శ్రీరామ కృష్ణ, చీఫ్ జోనల్ ఇన్ఛార్జులు దాగిల్ల దయానందరావు, బోడపట్ల ఈశ్వర్, నిషాని రామచంద్రం తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో పార్టీ కమిటీల పునర్నిర్మాణం, క్షేత్రస్థాయి కార్యాచరణ, భవిష్యత్ ఎన్నికల సన్నద్ధతపై వారు జాతీయ అధ్యక్షురాలికి సమగ్ర నివేదిక సమర్పించారు. బహుజన రాజ్యాధికార సాధన దిశగా ఐక్యంగా ముందుకు సాగాలని రాష్ట్ర నాయకత్వాన్ని అధినేత్రి ఆదేశించారు.