Copyrights Reserved © 2026
prajayuddanouka.com
ప్రజాయుద్ధనౌక/ ప్రత్యేక ప్రతినిధి: దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన నీట్-యుజి (NEET-UG) ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోడీ ఎట్టకేలకు స్పందించారు. నీట్ పేపర్ లీక్ కారణంగా 12 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం, మూడు నెలలుగా దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువత ఆందోళనలు చేస్తూ ఉద్యమం ఉదృతం చేసిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మంగళవారం జరిగిన ఎన్డీయే (NDA) పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని మాట్లాడుతూ.. నీట్ లీకేజీ ఘటనను అత్యంత తీవ్రమైన 'ఘోర పాపం'గా అభివర్ణించారు. ఈ కేసులో ప్రమేయం ఉన్న నిందితులందరినీ ఇప్పటికే అరెస్ట్ చేశామని, భవిష్యత్తులో ఎవరైనా ఇలాంటి చర్యలకు ఒడిగట్టాలంటే భయపడేలా వారిపై అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ ఉదంతంపై ప్రభుత్వం తక్షణమే స్పందించి, మళ్లీ పరీక్షలను సైతం నిర్వహించిందని ఆయన గుర్తుచేశారు. ప్రశ్నాపత్రాల లీకేజీ వంటి ఘటనలు పునరావృతం కాకుండా పరీక్షల నిర్వహణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంతో కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. అయితే, సోమవారం ఢిల్లీ వీధుల్లో విద్యార్థులు, యువత చేపట్టిన నిరసనలపై పోలీసులు వ్యవహరించిన తీరు, వారి దాష్టీకంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఆందోళనలను అణచివేయడం కాకుండా సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడకూడదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ప్రజాయుద్ధనౌక/ ప్రత్యేక ప్రతినిధి: విద్యా రంగ వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సిజెపి ఆధ్వర్యంలో విద్యార్థులు, యువత చేపట్టిన పార్లమెంట్ మార్చ్లో విద్యార్థులు, యువతపై లాఠీఛార్జ్ చేయడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండించాయి. మంగళవారం ఈ అంశంపై పార్లమెంట్ స్తంభించింది. నీట్ పేపర్ లీక్, విద్యార్థులపై లాఠీఛార్జ్లపై చర్చించాలని డిమాండ్ చేస్తూ ఉభయ సభల్లో ప్రతిపక్షాల ఆందోళనలు చేపట్టాయి. దీంతో సభలు వాయిదాల పర్వం కొనసాగాయి. దేశ రాజధానిలో సిజెపి ఆధ్వర్యంలో జరిగిన నిరసన ప్రదర్శన సందర్భంగా పోలీసుల అణచివేతకు వ్యతిరేకంగా ఆప్ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. లోక్సభను స్పీకర్ ఓంబిర్లా ప్రారంభించి ప్రశ్నోత్తరాలు నిర్వహించేందుకు ప్రయత్నించారు. ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేస్తూ వెల్లోకి తీసుకొచ్చారు. దీంతో లోక్సభ కార్యకలాపాలు ప్రారంభమైన రెండు నిమిషాల్లోనే మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన సభలోనూ ప్రతిపక్షాల ఆందోళన కొనసాగింది. దీంతో సభ ప్రారంభమైన తొమ్మిది నిమిషాల్లోనే మధ్యాహ్నం రెండు గంటలకు ప్యానెల్ స్పీకర్ సంధ్యా రే వాయిదా వేశారు. అనంతరం ప్రారంభమైన సభలో పరిస్థితిలో ఎటువంటి మార్పు రాలేదు. ప్యానెల్ స్పీకర్ దిలీప్ సైకియా నియమం 377 ప్రకారం, సభ్యులు తమ తమ స్థానాలలో కూర్చొని, సభా కార్యకలాపాలను కొనసాగించాలని కోరారు. ప్రతిపక్షాల ఆందోళన కొనసాగడంతో సభను నాలుగు నిమిషాల్లోనే బుధవారానికి వాయిదా వేశారు. మరోవైపు రాజ్యసభలోనూ అదే సీను కొనసాగింది. సభను ఛైర్మన్ సిపి రాధాకృష్ణన్ ప్రారంభించారు. ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలను వినాలని అన్నారు. "పేపర్ లీక్లు, నీట్ పరీక్షపై గళం విప్పుతున్న మన విద్యార్థులపై లాఠీఛార్జి, బాష్పవాయువు ప్రయోగించి దాడి చేశారు. వారు ఆసుపత్రుల్లో ఉన్నారు. వారి సమస్యలను వినాలి" అని ఖర్గే అన్నారు. దీంతో సభలో అధికార పార్టీ సభ్యులు లేచి కేకలు వేయడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. వెంటనే ఛైర్మన్ సిపి రాధాకృష్ణన్ సభను ఏడు నిమిషాల్లోనే మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన సభలోనూ ప్రతిపక్ష సభ్యుల ఆందోళన కొనసాగింది. దీంతో ఛైర్మన్ సభను ఒక్క నిమిషంలోనే మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేశారు. అనంతరం ప్రారంభమైన సభలో ప్రతిపక్షాలు వెల్లోకి వచ్చి ఆందోళన చేపట్టారు. డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ సింగ్ ఒక్క నిమిషంలోనే సభను బుధవారానికి వాయిదా వేశారు.