కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్తో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ భేటీ
ప్రజాయుద్ధనౌక ప్రత్యేక ప్రతినిధి (న్యూఢిల్లీ): తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల బృందం పార్లమెంట్ హౌస్ యానెక్స్లో బుధవారం కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్తో సమావేశమయ్యారు. ఈ భేటీ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలు, పెండింగ్ ప్రాజెక్టులపై విస్తృతంగా చర్చించారు.
రాష్ట్రంలో నిలిచిపోయిన పలు సాగునీటి ప్రాజెక్టులు, ప్రతిపాదిత రహదారుల నిర్మాణానికి అవసరమైన అటవీ మరియు పర్యావరణ అనుమతులను త్వరితగతిన మంజూరు చేయాలని కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, సీతమ్మసాగర్, ఎస్ఆర్ విఆర్ డిండి, గౌరవెల్లి వంటి కీలక ప్రాజెక్టులకు అనుమతులు లభిస్తేనే రాష్ట్ర ప్రజల తాగు, సాగునీటి అవసరాలు తీరుతాయని వివరిస్తూ ఈ మేరకు ఒక వినతిపత్రాన్ని సమర్పించారు. వీటితో పాటు, పర్యావరణ సంరక్షణను దెబ్బతీయకుండా ప్రజల సంక్షేమానికి, మౌలిక వసతుల కల్పనకు ఉపయోగపడే ఇతర అభివృద్ధి ప్రాజెక్టుల విషయంలో కూడా కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ సానుకూలంగా స్పందించి అవసరమైన సహకారాన్ని అందించాలని ముఖ్యమంత్రి భూపేందర్ యాదవ్ను కోరారు.