రోడ్లపై నడిచేందుకు ప్రత్యేక స్థలాన్ని ఏర్పాటు చేయండి: కేంద్రానికి సుప్రీంకోర్టు సంచలన ఆదేశం
»»» భారీ ఖర్చులు అవసరం లేదు.. తాత్కాలిక గుర్తులైనా చాలు: ధర్మాసనం
»»» ఐదేళ్ల బాలుడి ప్రమాదం కేసులో కీలక తీర్పు
»»» ఫుట్పాత్పై నడవడం పౌరుల ప్రాథమిక హక్కు
»»» ప్రత్యేక నియంత్రణ సంస్థ అవసరం
ప్రజాయుద్ధనౌక ప్రత్యేక ప్రతినిధి (న్యూఢిల్లీ): దేశంలో రహదారి వినియోగదారుల భద్రతకు సంబంధించి సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. దేశంలోని ప్రతి రహదారిపై పాదచారులు సురక్షితంగా నడిచేందుకు వీలుగా ప్రత్యేక స్థలాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. పాదచారుల కోసం కేటాయించిన ఈ మార్గాలు ఎలాంటి ఆక్రమణలకు గురికాకుండా చూడాలని, వాహనాల రాకపోకల మార్గం నుంచి వాటిని స్పష్టంగా వేరు చేసి గుర్తించాలని స్పష్టం చేసింది. ఈ అంశంపై విచారణ జరిపిన జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ అలోక్ అరాధే ధర్మాసనం కేంద్రం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ కేఎం నటరాజ్కు పలు కీలక సూచనలు జారీ చేసింది. ఎక్కడ రహదారి ఉంటే అక్కడ పాదచారుల కోసం ప్రత్యేక స్థలం కూడా ఉండాలని ధర్మాసనం స్పష్టం చేసింది. దీనికోసం భారీగా నిధులు ఖర్చు చేయాల్సిన అవసరం లేదని, తాడు లేదా ఇతర తాత్కాలిక గుర్తులతోనైనా పాదచారుల మార్గాన్ని స్పష్టంగా గుర్తించాలని పేర్కొంది. ఆ స్థలంలో ఎలాంటి ఆక్రమణలు జరగకుండా చూస్తూ, వాహనాల భయం లేకుండా పాదచారులు తమ మార్గంలో స్వేచ్ఛగా, సురక్షితంగా నడిచే పరిస్థితిని కల్పించాలని ఆదేశించింది. ఈ వ్యవహారంపై సంబంధిత శాఖలకు తగిన ఆదేశాలు జారీ చేయాలని కేంద్రానికి సూచించిన సుప్రీంకోర్టు, ఇందుకు రెండు వారాల గడువు ఇస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది.
ఒక రోడ్డు ప్రమాద పరిహారం కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. కొంతకాలం క్రితం తండ్రితో కలిసి పాఠశాలకు వెళ్తున్న ఐదేళ్ల బాలుడిని వెనుక నుంచి వచ్చిన ఒక లారీ ఢీకొట్టడంతో ఆ బాలుడు మృతి చెందాడు. ఈ ఘటనపై బాలుడి తండ్రి రూ. 25 లక్షల పరిహారం కోరుతూ మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునల్ను ఆశ్రయించగా, ట్రైబ్యునల్ రూ. 7.82 లక్షలు మంజూరు చేసింది. అయితే హైకోర్టులో అప్పీల్ చేయగా పరిహారాన్ని రూ. 4.70 లక్షలకు తగ్గించింది. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన తండ్రికి ఊరటనిస్తూ, హైకోర్టు తీర్పును రద్దు చేసిన అత్యున్నత న్యాయస్థానం రూ. 11.44 లక్షల పరిహారాన్ని రెండు నెలల్లోగా చెల్లించాలని ఆదేశించింది.
ఈ సందర్భంగా ప్రత్యేకంగా గుర్తించిన ఫుట్పాత్పై నడవడం ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(డి) ప్రకారం స్వేచ్ఛగా సంచరించే హక్కుతో పాటు, ఆర్టికల్ 19(1)(ఏ), 19(1)(బి), 19(1)(సి) మరియు ఆర్టికల్ 21లోని జీవించే హక్కుతో కూడా ఈ హక్కు ముడిపడి ఉందని పేర్కొంది. రోడ్లపై మోటారు వాహనాల కంటే పాదచారుల హక్కులకే మొదటి ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేసింది. పట్టణాభివృద్ధి సంస్థలు, మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పంచాయతీలు పాదచారుల మార్గాలను నిర్మించడం, నిర్వహించడం మరియు ఆక్రమణల నుంచి కాపాడటం తమ విధిగా నిర్వర్తించాలని స్పష్టం చేసింది. అలాగే పాదచారుల హక్కుల పరిరక్షణ కోసం ప్రత్యేక నియంత్రణ సంస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడిన సుప్రీంకోర్టు, పాదచారుల హక్కుల ఉల్లంఘన జరిగితే అధికారులపై చట్టపరమైన చర్యలు కోరే హక్కు పౌరులకు ఉంటుందని స్పష్టం చేసింది.