వెంకట్ నాయక్ తండాలో వైభవంగా 'తీజ్' ఉత్సవాలు
ప్రజాయుద్ధనౌక ప్రతినిధి (నల్గొండ/ చందంపేట, ఆగస్టు 11): మండలంలోని పోలేపల్లి పంచాయతీ పరిధిలోని వెంకట్ నాయక్ తండాలో 'తీజ్' ఉత్సవాలు అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో జరిగాయి. గిరిజన ఆచార సంప్రదాయాల నడుమ సాగిన ఈ సంబరాల్లో ఉత్తమ జాతీయ అవార్డు గ్రహీత నేనావత్ శ్రీను నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉత్సవాల్లో భాగంగా తండాలోని శ్రీ తుల్జా భవానీ మేరమ్మ దేవాలయాన్ని శ్రీను నాయక్ దర్శించుకున్నారు. ఆలయ పూజారి చోక్లా నాయక్, ఆలయ కమిటీ ప్రతినిధుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తండావాసులందరూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ప్రార్థించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు శ్రీను నాయక్ను శాలువాతో ఘనంగా సన్మానించి, అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ తరతరాలుగా వస్తున్న తీజ్ పండుగ సంప్రదాయాలను భావితరాలకు అందిస్తూ ఉత్సాహంగా జరుపుకోవడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి చోక్లా నాయక్ (హనుమంతు), సుక్క నాయక్, బద్దు నాయక్, బాల, చత్రు, రాజేష్, సైదులు, తండా పెద్దలు, యువకులు, పెద్ద సంఖ్యలో భక్తులు, తదితరులు పాల్గొన్నారు.