తెలంగాణ
తాటికోల్ జెడ్పీ పాఠశాలలో అనాథ విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ
ప్రజాయుద్ధనౌక ప్రతినిధి (నల్గొండ/ దేవరకొండ): పేద, అనాథ విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తూ తాటికోల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యా సామగ్రి పంపిణీ కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. హైదరాబాద్ కు చెందిన ‘యూత్ ఫర్ సేవా’ సేవా సంస్థ సౌజన్యంతో పాఠశాలలోని అనాథ, పేద విద్యార్థులకు నోట్బుక్స్, స్కూల్ బ్యాగులు, జామెట్రీ బాక్సులను అందజేశారు. ప్రధానోపాధ్యాయులుగా జె. బక్కయ్య బాధ్యతలు చేపట్టిన తర్వాత పాఠశాలలో విద్యా ప్రమాణాలు గణనీయంగా పెరిగాయని, విద్యార్థుల అభ్యున్నతికి ఆయన తీసుకుంటున్న ప్రత్యేక చర్యలు అభినందనీయమని విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అవసరమైన సామగ్రిని అందించి వారి చదువుకు ఆసరాగా నిలిచిన ‘యూత్ ఫర్ సేవా’ సంస్థకు ప్రధానోపాధ్యాయులు జె. బక్కయ్య, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ప్రతినిధులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.