ఓయూలో ఘనంగా ఆచార్య జయశంకర్ జయంతి వేడుకలు
ప్రజాయుద్ధనౌక ప్రతినిధి హైదరాబాద్ (ఉస్మానియా యూనివర్సిటీ): ఉస్మానియా యూనివర్సిటీ లోని ప్రసిద్ధ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ సార్ జయంతి వేడుకలను గురువారం అత్యంత ఘనంగా నిర్వహించారు. విద్యార్థి జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు మాసంపల్లి అరుణ్ పిలుపు మేరకు, ఓయూ అధ్యక్షుడు చెరుకు శివరాజ్ నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఓయూ విద్యార్థి నాయకులు జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి, అంజలి ఘటించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలోనూ, భావజాల వ్యాప్తిలోనూ జయశంకర్ సార్ పోషించిన పాత్ర స్మరణీయమని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ విద్యార్థి సంఘాల నాయకులు వలిగొండ నరసింహ, జంగిలి దర్శన్, విద్యార్థి జన సమితి నాయకుడు శివతో పాటు పలువురు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.