21 ఏళ్లకే చట్టసభలకు అర్హత సాధించేలా తీర్మానం: ఆగస్టు తొలివారంలో తెలంగాణ ప్రత్యేక అసెంబ్లీ — సీఎం రేవంత్ రెడ్డి
ప్రజాయుద్ధనౌక ప్రతినిధి (హైదరాబాద్): నీట్ (NEET) పేపర్ లీకేజీకి నిరసనగా శనివారం సాయంత్రం నెక్లెస్ రోడ్డులో నిర్వహించిన క్యాండిల్ ర్యాలీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడిన ఆయన, పేపర్ లీక్ పై నిరసన తెలిపి కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించిన విద్యార్థుల విజయాన్ని అభినందించారు.
ప్రధాని మోదీ జాతీయ యువత ముందు తలవంచి ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించారని సీఎం పేర్కొన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు విద్యార్థుల ఉద్యమమే కారణమని, యువత తలుచుకుంటే చేయలేనిది ఏదీ లేదని నేడు నిరూపించారని ప్రశంసించారు. అయితే ఈ విజయాన్ని కాంగ్రెస్ ఖాతాలో ఎట్టిపరిస్థితుల్లోనూ వేసుకోబోమని, ప్రభుత్వం విఫలమైన ప్రతి అంశంపైనా తాము పోరాడుతామని సీఎం స్పష్టం చేశారు. ఇదే క్రమంలో కేంద్రంతో సీజేపీ జరిపిన చర్చల్లో ఇంకా కొన్ని పెండింగ్లో ఉన్నాయని సీఎం వెల్లడించారు. విద్యార్థులపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని, వారిపై కేసులు నమోదు కాకుండా చూడాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో ఉన్న రాజకీయాలు, చట్టాలు యువతకు అడ్డుపడలేవన్న రేవంత్ రెడ్డి, ప్రపంచంలోని అనేక దేశాల్లో 18 సంవత్సరాలకే చట్టసభలకు వెళ్లే అవకాశం ఉందని గుర్తుచేశారు. 21 సంవత్సరాలకే సింగపూర్లో ప్రధాని కావచ్చని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆగస్టు తొలివారంలో తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి.. దేశంలో ఎమ్మెల్సీ, ఎంపీ పోటీ చేసేందుకు 21 సంవత్సరాలు ప్రధాన అర్హతగా తీర్మానం చేసి, ఆ తీర్మానాన్ని ప్రధానమంత్రి మోదీకి పంపనున్నట్లు సీఎం వెల్లడించారు. జంతర్ మంతర్ వీధుల్లో ధర్నా చేయడమే కాకుండా.. లోక్సభ, రాజ్యసభలలో యువత తమ గళాన్ని వినిపించేలా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.