జాతీయం
బ్రేకింగ్
నీట్ లీకేజీపై ప్రధాని మోడీ స్పందన – ‘ఘోర పాపం’గా అభివర్ణన
ప్రజాయుద్ధనౌక/ ప్రత్యేక ప్రతినిధి: దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన నీట్-యుజి (NEET-UG) ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోడీ ఎట్టకేలకు స్పందించారు. నీట్ పేపర్ లీక్ కారణంగా 12 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం, మూడు నెలలుగా దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువత ఆందోళనలు చేస్తూ ఉద్యమం ఉదృతం చేసిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మంగళవారం జరిగిన ఎన్డీయే (NDA) పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని మాట్లాడుతూ.. నీట్ లీకేజీ ఘటనను అత్యంత తీవ్రమైన 'ఘోర పాపం'గా అభివర్ణించారు. ఈ కేసులో ప్రమేయం ఉన్న నిందితులందరినీ ఇప్పటికే అరెస్ట్ చేశామని, భవిష్యత్తులో ఎవరైనా ఇలాంటి చర్యలకు ఒడిగట్టాలంటే భయపడేలా వారిపై అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ ఉదంతంపై ప్రభుత్వం తక్షణమే స్పందించి, మళ్లీ పరీక్షలను సైతం నిర్వహించిందని ఆయన గుర్తుచేశారు. ప్రశ్నాపత్రాల లీకేజీ వంటి ఘటనలు పునరావృతం కాకుండా పరీక్షల నిర్వహణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంతో కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. అయితే, సోమవారం ఢిల్లీ వీధుల్లో విద్యార్థులు, యువత చేపట్టిన నిరసనలపై పోలీసులు వ్యవహరించిన తీరు, వారి దాష్టీకంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఆందోళనలను అణచివేయడం కాకుండా సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడకూడదని పలువురు అభిప్రాయపడుతున్నారు.