ఏవీ వినూత్న హోమ్స్లో ఘనంగా బోనాల ఉత్సవాలు
ప్రజాయుద్ధనౌక ప్రతినిధి (మేడ్చల్ మల్కాజ్గిరి/ పోచారం): పోచారం పరిధిలోని ఏవీ వినూత్న హోమ్స్లో బోనాల పండుగ ఉత్సవాలు అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించబడ్డాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ వేడుకలను నివాసితులు కన్నుల పండుగగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులందరూ పోచారం శ్రీ మహంకాళి అమ్మవారి దేవాలయానికి చేరుకుని భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, ఏవీ వినూత్న హోమ్స్లో తొలిసారిగా బోనాల పండుగను ఇంత ఘనంగా నిర్వహించడం ఎంతో సంతోషకరమని పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ భావితరాలకు అందించేలా ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని ఆయన కొనియాడారు. ఈ వేడుకల్లో కాలనీ కుటుంబ సభ్యులు, మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. డప్పు చప్పుళ్లు, భక్తుల సందడి, మహిళల సంప్రదాయ బోనాలతో ఏవీ వినూత్న హోమ్స్ ప్రాంగణం పండుగ శోభను సంతరించుకుంది. భక్తి, సంప్రదాయం, ఆత్మీయతల కలయికగా సాగిన ఈ బోనాల వేడుకలు స్థానికులను విశేషంగా ఆకట్టుకుని విజయవంతంగా ముగిశాయి.