ఉప ఎన్నికల ఫలితాలు: జెన్ జీ ఉద్యమ ఎఫెక్ట్.. బీజేపీకి బిగ్ షాక్.. రెండు చోట్ల ఘోర పరాజయం, బీహార్లో ప్రశాంత్ కిషోర్ ప్రభంజనం
ప్రజాయుద్దనౌక (ప్రత్యేక ప్రతినిధి): దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన 'జెన్ జీ' విద్యార్థుల ఆందోళనలు, నీట్ పేపర్ లీక్ వివాదాల అనంతరం జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది. కమలం పార్టీ పాలనలో ఉన్న మూడు రాష్ట్రాల పరిధిలోని మూడు నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగ్గా, రెండింటిలో తీవ్ర పరాభవం ఎదురైంది. ఒక చోట మాత్రమే విజయం సాధించి బీజేపీ ఓ మోస్తరు ఊరట పొందింది. బీహార్ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం నమోదైంది. గత 30 ఏళ్లుగా బీజేపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్న బంకిపూర్ నియోజకవర్గంలో జన్ సూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ సంచలన విజయం దిశగా దూసుకెళ్లారు. 26 రౌండ్ల లెక్కింపు పూర్తయ్యేసరికి ప్రశాంత్ కిషోర్కు 53,566 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్కు 37,702 ఓట్లు పోలయ్యాయి. దీంతో ప్రశాంత్ కిషోర్ 15,864 ఓట్ల భారీ ఆధిక్యంలో కొనసాగుతూ గెలుపును ఖాయం చేసుకున్నారు. ఈ రేసులో ఆర్జేడీ అభ్యర్థి రేఖా కుమారి 11,933 ఓట్లతో మూడో స్థానానికే పరిమితమయ్యారు. మరోవైపు మధ్యప్రదేశ్లోని దాతియా నియోజకవర్గంలోనూ బీజేపీకి పరాభవం ఎదురైంది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఘనశ్యామ్ సింగ్ తన హవా చాటారు. 11 రౌండ్ల లెక్కింపు ముగిసే సమయానికి ఘనశ్యామ్ సింగ్ 54,169 ఓట్లు సాధించి, బీజేపీకి చెందిన అశుతోష్ తివారీ (41,948 ఓట్లు) పై 12,221 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అయితే, సొంత రాష్ట్రమైన గుజరాత్లో మాత్రం బీజేపీ తన పట్టును నిలబెట్టుకుంది. మంజల్ పూర్ ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి సతీష్ పటేల్ 55,481 ఓట్లు సాధించి, కాంగ్రెస్ అభ్యర్థి భిఖాభాయ్ రబరీ (24,851 ఓట్లు) పై 30,630 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. మొత్తానికి ఈ ఫలితాలు దేశ రాజకీయాల్లో, ముఖ్యంగా బీహార్లో జన్ సూరజ్ పార్టీ రూపంలో కొత్త సమీకరణాలకు దారితీసేలా కనిపిస్తున్నాయి.